జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి..

ఎల్లారెడ్డి: జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించడం జరుగుతుందని.. ఈ క్రమంలో అక్రమార్కుల గుండెల్లో భయం పుట్టి ప్రశ్నించే గొంతును భయపెట్టాలని జర్నలిస్టులపై బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన అల్లర్లలో జర్నలిస్టులపై కత్తులతో దాడి చేయడాన్ని, అదేవిధంగా వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాజ్ న్యూస్ ప్రతినిధిపై దాడి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు.
భైంసాలో జరిగిన అల్లర్ల వెనుక నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసిల్దార్, డి.ఎస్.పి, సిఐలకు వినతి పత్రం అందజేశారు. కత్తి కంటే కలమే గొప్పదని.. కత్తులతో కలాన్ని అణిచివేయాలని చూస్తే ఊరుకునేదిలేదని అన్నారు. విలేకరులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.