దుబ్బాక గడ్డ రీ సౌండ్ వినాలి: రఘునందన్ రావు
సిద్దిపేట: తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికలో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో రిటర్నింగ్ అధికారినుంచి దృవీకరణ పత్రం అందుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చదివిన గడ్డ మీద నుంచి వచ్చిన రీసౌండే ఈ విజయమన్నారు. వ్యవస్థల ద్వారా పెత్తనం చేస్తూ వ్యక్తులను హింసించాలని చూస్తే చప్పుడు ఇలానే వస్తుందని హెచ్చరించారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా సిద్దిపేట గడ్డ ప్రజలిచ్చిన ఈ తీర్పు ప్రగతి భవన్ దాకా పోవాలన్నారు. దుబ్బాక చారిత్రాత్మక తీర్పు పాలకులకు కనువిప్పు కావాలని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తమను వేధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. తన చివర శ్వాస వరకు కూడా దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని రఘునందన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్షా, నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో సహకరించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, డికె అరుణ, ధర్మపురి అరవింద్ తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.