దేశంలో కొత్తగా 46 వేల కరోనా కేసులు
93.7 శాతానికి చేరిన రికవరీ రేటు 24 గంటల్లో కొత్తగా46,232.. 564 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కేసుల్లో మరోసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి. ఇందులో 84,78,124 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నిన్నటి నుంచి ఇప్పటిదాకా 49,715 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి వల్ల మరో 564 మంది మృతిచెందారు. దీంతో కరోనా మరణాలు 1,32,726కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
దేశంలో మరోమారు కరోనా కేసులు పెరుగుతుండటంతో భారతీయ వైద్యపరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) పరీక్షలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒకేరోజు 10,66,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. దీంతో నవంబర్ 20 వరకు దేశవ్యాప్తంగా 13,06,57,808 నమూనాలను పరీక్షించింది.