నందిగ్రామ్ బరిలో మమత
కోల్కతా : రాష్ట్రంలోని 294 స్థానాలకుగాను 291 మంది పార్టీ అభ్యర్థులను శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా ఈ సారి ఎన్నికల్లో దీదీ నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనుంది. ఉత్తర బెంగాల్లోని 3 స్థానాలకు పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని తెలిపారు. 291 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా వీరిలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్డ్ కులాలు, 17 మంది షెడ్యూల్డ్ తెగల వారికి అవకాశం దక్కింది. తృణమూల్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మాజీ మంత్రి, టీఎంసీ నాయకుడు సువేందు అధికారికి నందిగ్రామ్లో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీకి దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.