నంద్యాల సిఐ సోమశేఖర్రెడ్డి అరెస్టు
కుటుంబం ఆత్మహత్య కేసు వ్యవహారం..

నంద్యాల : నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే సిఐని సస్పెండ్ చేయగా.. తాజాగా ఆయనకపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డిఐజి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తును పోలీస్ అధికారులు ముమ్మరం చేశారు.
కాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేశారు.
షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.