పాతికేళ్లు దాటితే టీకా.. పేద‌ల‌కు రూ. 6వేలు ఆర్థిక‌ సాయం..

కేంద్రానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సూచనలు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో కేంద్ర స‌ర్కార్ ఘోరంగా విఫ‌ల‌మైందని కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ విమ‌ర్శించారు. క‌రోనాపై పోరాడే క్ర‌మంలో కొన్ని రాష్ట్రాలపై కేంద్ర వివ‌క్ష చూపిస్తుందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర స‌ర్కార్‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) శనివారం సమావేశమై…దేశంలో నెలకొంటున్న కరోనా సంక్లిష్ట పరిస్థితులపై చర్చించింది.

క‌రోనాను కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ స్థాయి స‌వాల్‌గా ప‌రిగ‌ణించింది. పార్టీల‌క‌తీతంగా ఈ మ‌హ‌మ్మారిపై పోరాటం చేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించిందని ఆమె తెలిపారు. కేంద్రానికి కీలక సూచనలు చేసింది. కోవిడ్ పేషెంట్స్‌ చికిత్సకు వినియోగించే అన్ని రకాల లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్‌, వైద్య పరికరాలపై జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని కోరింది. అలాగే దేశంలో 25 ఏళ్లకు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వయోపరిమితిని 25 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువకులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్లు ఇస్తుండటం తెలిసిందే.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీనుద్దేశించి మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ…కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు లేఖ రాసినా ప్రయోజనం దక్కడం లేదన్నారు. కోవిడ్ ఆంక్షలు, ఆర్థిక కార్యకలాపాల్లో స్తబ్ధత కారణంగా ఉపాధిని కోల్పోయిన పేదలను నెలకు రూ.6000 ఆర్థిక సాయాన్ని అంజేయాలని సూచించారు.

కోవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కారుకు ముందుచూపు కొరవడిందని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. దేశంలో కరోనా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.