పల్లె ప్రగతి పథకం దేశానికే ఆదర్శం: గవర్నర్ తమిళిసై
పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ : 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. “తెలంగాణ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదర్కొంది“ అని అన్నారు. భారత్ బయోటెక్ తొలి దేశీయ టీకాను రూపొందించిందని పేర్కొన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. పల్లె ప్రగతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 91 శాతం సంరక్షించామని చెప్పారు. 12 వేలకు పైగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వేదేశీ కొవిడ్ వ్యాక్సిన్తో ముందుకెళ్తున్నామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే పట్టణాల్లో మౌలిక సౌకర్యాల కోసం ఏటా రూ. 148 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలోని పట్టణాల్లో 2,802 పారిశుద్ధ్య వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.