బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : బ్రిటన్లో కొత్త వైరస్ మూలాలు బయటపడటంతో అక్కడి నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు జరుపగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ ఆరుగురు ప్రయాణికులను సంస్థాగత నిర్బంధానికి పంపించగా, మరో 50 మంది ప్రయాణికులను ముందుజాగ్రత్తగా సంస్థాగత నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఆరుగురు పాజిటివ్ ప్రయాణికుల నమూనాలను మరింత పరీక్ష కోసం పంపారు.
కొత్త కరోనావైరస్ ఉనికి బ్రిటన్లో ఆవిర్భావంతో యావత్ ప్రపంచం ఆందోళనకు గురైంది. కొవిడ్-19 వైరస్ కొత్త జాతిని గుర్తించడంతో భారతదేశం సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఈ వేరియంట్ మరింతగా అంటువ్యాధి అని, నియంత్రణలో లేదని వర్ణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్లతో పాటు వివిధ విమానాశ్రయాలలో బ్రిటన్ నుంచి కనీసం 20 మంది ప్రయాణికులు కొవిడ్-19 కు పాజిటివ్ పరీక్షించినట్లు తెలిసింది.