భారత్‌లో కొత్త కరోనా వైరస్‌.. ఆ మూడు రాష్ట్రాల్లో ఆనవాళ్లు..!

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం ప‌డుతున్న త‌రుణంలో కొత్త రకం వైరస్ ప్ర‌జ‌ల‌ను భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్‌ రూపు మార్చుకుని కొత్త వైరస్‌గా రూపాంతరం చెందినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ను ఎన్‌ 440కెగా నామకరణం చేశారు. దీనికి యాంటీ బాడీస్‌ నుండి తప్పించుకునే లక్షణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రలో దీని ఉనికిని గుర్తించారు. అదేవిధంగా నోయిడాలో కూడా ఈ కొత్త రకం ఆనవాళ్లను కనుగొన్నారు. భారత్‌లో ఇప్పటికే కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త కరోనాతో కేసులు పెరగవచ్చునన్న ఆందోళన నెలకొంది.
బ్రిటన్‌లో తొలుత ఉద్భవించిన కొత్త రకం కరోనా వైరస్‌ బి117ను గుర్తించిన విషయం తెలిసిందే. గత వైరస్‌తో పోల్చుకుంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో సైతం మరో బూచిగా తయారయింది. తాజాగా భారత్‌లో ఎన్‌ 440కె రకాన్ని గుర్తించారు. బ్రిటన్‌లో 2.2 లక్షల మంది కోవిడ్‌ రోగుల్లో 6 శాతం మంది కొత్త స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ బారిన పడగా..భారత్‌లో కోటి మందికి పైగా కరోనా రోగుల్లో 0.05 శాతం మంది కొత్త కరోనా రకం ఎన్‌ 440కె బారిన పడ్డారని వెల్లడైంది.

Leave A Reply

Your email address will not be published.