మండపేటలో పాతికేళ్ల టిడిపి ఆధిపత్యానికి చెక్
మండపేట: ఆంధ్రప్రదేశ్లోని తూ.గో. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరుపొందిన మండపేట పురపాలక సంఘం వైసీపీ పరమైంది. ఈ తీర్పుతో పాతికేళ్ల టిడిపి ఆధిపత్యానికి గండి పడింది. మొత్తం 30 వార్డులకు 22 చోట్ల వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం 7 వార్డులకు పరిమితమైంది. ఒక వార్డు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. దాదాపు 25 ఏళ్లుగా మండపేట మున్సిపాలిటీలో టీడీపీదే ఆధిపత్యం. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్ పర్సన్గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జునచౌదరి సతీమణి విజయ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2000, 2005, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించగా అందులో సగంపైగా మండపేట పట్టణం నుంచే వచ్చింది. వైసిపి అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తన రాజకీయ వ్యూహాలతో పార్టీకి ఘనవిజయం అందించారు. ఏదీ ఏమైనా మండపేటలో ఇక టిడిపి ఆధిపత్యానికి తెరపడింది.