ముంబయిలో నైట్ కర్ఫ్యూ.. బ్రిటన్ ‘కరోనా’ స్ట్రెయిన్’ ఎఫెక్ట్

ముంబయి: బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో భారత్ అప్రమత్తమైంది. బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుండి ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ముంబై నగర పాలక సంస్థ పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపింది. మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ మొదలవుతుందని వివరించింది. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు మంగళవారం నుంచి తప్పనిసరి సంస్థాగత క్వారంటైన్కు వెళ్లాలని స్పష్టం చేసింది. ఆదివారం నాడే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోనూ, దాని రాజధాని ముంబైలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.