మరో మూడు రోజులు ముసురే!

హైదరాబాద్ : ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల వరదల్లోంచి ఇంకా తేరుకోకముందే.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దాంతో పాటు దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తనం, దీని మీదుగా 1.5 కిలో మీటర్ల నుంచి 2.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 19న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇది 20వ తేదీ నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సముద్రానికి అమావాస్య పోటు..
కాగా శనివారం ఉదయం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం ఒకటి రెండు చోట్ల, ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.