రాజస్తాన్లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి

జైపూర్ : రాజస్తాన్లో కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో మరో 14 మంది గల్లంతయ్యారు. పడవలో మొత్తం 35 నుంచి 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొందరు గజ ఈతగాళ్లు ఇప్పటికే నదిలో దిగి బాధితులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పడవలో కొందరు బైక్లను కూడా తీసికెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక బృందాలతో చంబల్ నది మొత్తం జల్లెడ పడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సహాయక చర్యలను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంక గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లు చంబల్ నదీని జల్లెడ పడుతున్నారు.
Rajasthan: A boat carrying around 45 devotees to a temple capsize in Chambal river Kota district. “Three bodies have been recovered. The rescue operation is underway,” says SDM (Etawah) Ramavtar Barnala, Kota. pic.twitter.com/dfXFCwJ19E
— ANI (@ANI) September 16, 2020