రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు
భార్య, వ్యక్తిగత కార్యదర్శి మృతి

బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ, ఆయూష్ శాఖ సహాయమంత్రి శ్రీపాదనాయక్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోకర్ణకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అంకోలా తాలూకా హోసాకంబీ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్, ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ దూబే, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు. విజయ తలకు తీవ్ర గాయమైంది. కాగా, వారిని చికిత్స కోసం సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మరణించారని పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం గోవాకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తున్నది. ఆయన్ను గోవాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గోవా సీఎంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి తక్షణమే అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.