వలస పక్షుల కారణంగానే బర్డ్ఫ్లూ..
న్యూఢిల్లీ : భారత్లో వలస పక్షుల కారణంగానే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని, ఇది ఆందోళన కలిగించేవిధంగా ఉందని కేంద్ర మత్స్య పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. సెప్టెంబర్- అక్టోబర్ నుండి ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరిగే వలస పక్షులతో బర్డ్ఫ్లూ వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంది. మానవుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనను తోసిపుచ్చలేమని తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ నాలుగు రాష్ట్రాల్లోని 12 కేంద్రాల నుండి సేకరించిన నమూనాలను ఐసిఎఆర్- ఎన్ఐహెచ్ఎస్ఎడి పరీక్షల ద్వారా బర్డ్ఫ్లూ ఉన్నట్లు నిర్థారించినట్లు తాజా నివేదికలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశవ్యాప్తంగా 25వేల పక్షులు మరణించాయి. హిమాచల్ ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.