విద్యార్థులకు 2జీబీ డేటా ఉచితం
చెన్నై: ఆన్లైన్లో చదువుకునేందుకు విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ ఇంటర్నెట్ డేటాను తమిళనాడు సిఎం పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా గత సంవత్సరం మార్చిలో విద్యా సంస్థలు మూత పడిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత డేటాను అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో వార్షిక పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను యూజీసీ, ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించాయి. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కళాశాల విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కళాశాలలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి.
దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు సిఎం ఉత్తర్వులు ఇచ్చారు.