విద్యార్థులూ ఆందోళన వద్దు: మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : కాచిగూడ ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, హాస్టల్ భవనానికి అవసరమైన మరమ్మతులు పరీక్షల అనంతరమే చేపడుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. బుధవారం మంత్రిని కలిసి హాస్టల్ విద్యార్థులు వినతిపత్రం అందజేసిన సందర్బంగా వారికి మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక మరమ్మతులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు మంత్రి కొప్పుల ఆదేశించారు.
కాగా పురాతన వసతి గృహానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇటీవల అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు మంత్రిని కలిసి డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున మరమ్మతులను వాయిదా వేయాలని, భోజన వసతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. వివిధ కోర్సుల పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.