సింగపూర్లో న్యాయవాదికి 27 నెలల జైలు శిక్ష

సింగపూర్: సింగపూర్లో భారత సంతతి న్యాయవాది జమీందర్ సింగ్ గిల్(57)కి అక్కడి న్యాయస్థానం 27 నెలల జైలు శిక్ష విధించింది. క్లయింట్స్ చెల్లించిన ఫీజులను దుర్వినియోగం చేసిన కేసులో సోమవారం సింగపూర్ న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. కేసు వివరాలు పరిశీలిస్తే.. జమీందర్ సింగ్ గిల్ అనే భారత సంతతి న్యాయవాది తను పనిచేసే లీగల్ అసోసియేషన్కు చెందిన క్లయింట్స్ చెల్లించిన రూ. 16.68 లక్షలు (31 వేల సింగపూర్ డాలర్లు) తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాడు. హిల్బోర్న్ లాలో లీగల్ అసోసియేట్ లో 2016-19 సంవత్సరాల మధ్య పనిచేశాడు. ఆ సమయంలో ఆ అసోసియేట్లోని డబ్బులను తన ఖాతాలో జమ చేసుకుని కుటుంబ అవసరాల కోసం వినియోగించుకున్నాడు. ఈ డబ్బుల వాడకంపై ఒక క్లయింట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019, జూలై 18న జమీందర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో జమీందర్ స్వదేశానికి వచ్చి తిరిగి అక్టోబర్లో సింగపూర్ వెళ్లాడు. సింగపూర్లో అడుగుపెట్టగానే పోలీసులు జమీందర్ను అరెస్ట్ చేశారు. సోమవారం ఈ కేసు విచారణకు జరిపిన సింగపూర్ న్యాయస్థానం జమీందర్ను ఐదు నేరాల్లో దోషిగా తేల్చి 27 నెలల జైలు శిక్ష విధించింది.