జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ!
ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సీఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రంలో జలవనరుల శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా మార్పులు చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను కూడా పెంచారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని సమావేశంలో నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు పెరుగనుంది.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, జోగు రామన్న పాల్గొన్నారు.