త్వరలో రాష్ట్రంలో 14 వేల అంగన్వాడి పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
ములుగు (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 14 వేల అంగన్వాడి పోస్టులు భర్తీ చేయనున్నట్లు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగులోని సఖి కేంద్రంలోని బాలసదనం భవన నిర్మాణానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో 4 వేల అంగన్వాడి కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడి కేంద్రాలుగా మార్చామన్నారు. ములుగు క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటి ఆటో సంఘాలతో చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఈ సందర్బంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. ములుగు పక్కనున్న నియోజక వర్గాలను కూడా అభివృద్ది చేయాలని కోరారు.