20 శాతానికి పైగా ఏటీఎంల మూసివేత
రోజుకు 200 స్వైపింగ్ లేని ప్రాంతాల్లో ఎత్తివేత

హైదరాబాద్: కరోనా దెబ్బకు బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్డౌన్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేల ప్రజలంతా నగదు లావాదేవీల వాడకం తగ్గించారు. దీంతో అందరుఆన్లైన్ పేమెంట్ల వైపు మొగ్గు చూపారు. అలాగే ఒకవైపు ఆన్లైన్ పేమెంట్లు, మరోవైపు కరోనా ప్రభావంతో ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏటీఎంలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటు పడటంతో వీటి అవసరం చాలా వరకు తగ్గుతోంది. దీంతో ప్రతిరోజూ కనీసం 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరంలో వివిధ బ్యాంకులకు సంబంధించి సుమారు 4 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 20 శాతానికి పైగా ఏటీఎంలను మూసివేసినట్టు సమాచారం.