28 నుంచి మణుగూర్ ఎక్స్ప్రెస్ రైలు పునఃప్రారంభం

సికింద్రాబాద్::కరోనా మహమ్మారి మూలంగా గత 10 నెలల కిందట ఆగిపోయిన రైల్లు ఒక్కొక్కటిగా పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ మధ్య రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుక్రవారం వెల్లడించింది.
కరోనా లాక్డౌన్ వల్ల గతేడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు రద్దయ్యాయి. అందులో భాగంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి నడిచే ఆరు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం.
ఎట్టకేలకు ఈ రైలు ప్రారంభమయింది. ఈ రైలు మణుగూరులో ప్రారంభమై భద్రాచలం(కొత్తగూడెం) రోడ్, కారేపల్లి, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ స్టేషన్లలో మాత్రమే నిలుస్తుందని ఆ శాఖ నిర్ణయించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు.
మణుగూరు నుండి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నెం. 02745) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 28వ తేదీ రాత్రి 11:45 గంటలకు బయలు దేరుతుంది. మణుగూరు నుండి ఇదే రైలు (ట్రైన్.నెం. 02746) 29వ తేదీ రాత్రి 10:25 గంటలకు సికింద్రాబాద్కు బయలుదేరనుంది.