30న బాబ్రీ కేసు తీర్పు
అడ్వాణి, జోషి హాజరు తప్పనిసరి

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెప్టెంబరు 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ తీర్పును ప్రకటించనున్నారు. తీర్పును వినేందుకు ఈ కేసులోని నిందితులందరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో బీజేపీ వెటరన్ నేతలు ఎల్.కే.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితులుగా ఉన్నారు. జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్ సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 19న జారీ చేసిన ఆదేశంలో.. బాబ్రీ కేసులో తీర్పును సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. బాబ్రీ స్థలంలో పురాతన రామాలయం ఉదంటూ ‘కరసేవకులు’ 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో రామాలయ ఉద్యమానికి సారథ్యం వహించిన వారిలో ఎల్.కె.అడ్వాణీ, ఎం.ఎం.జోషిలు ఉన్నారు. అడ్వాణీ, జోషిలు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తమ వాంగ్మూల్మం ఇచ్చారు.
కాగా, వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు అప్పగించాలని గత ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్యలోనే మరో చోట ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని కూడా ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.కాగా ఈ కేసును త్వరితగతిన విచారణ పూర్తి చేసి రెండేళ్లలో తీర్పు వెలువరించాలని 2017లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 30లోగా తీర్పు వెలురించాలని ప్రత్యేక న్యాయస్థానానికి గడువు విధించిన నేపథ్యంలో గడువు చివరి రోజలైన ఈనెల 30న తీర్పు వెలువడనుంది. కాగా ఇటీవలే వాంగ్మూలం ఇచ్చిన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు రాజకీయ కుట్రలో భాగంగా తమ పేర్లను ఈ కేసులో ఇరికించారని వివరణ ఇచ్చారు.