రైతుబంధు డబ్బులను బ్యాంకు అధికారులు రుణం పేరిట రైతులకు ఇవ్వకపోతే కఠిన చర్యలు..
కామారెడ్డి: రైతుబంధు డబ్బులను బ్యాంకు అధికారులు రుణం పేరిట రైతులకు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ హెచ్చరించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రైతు బంధు పథకం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకు అధికారులు రైతుబంధు డబ్బులు ఇవ్వని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 173 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు చెప్పారు. జిల్లాలో రెండు లక్షల 61వేల 758 మంది రైతులకు రైతు బంధు పథకం కింద డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు. ఇంకా రైతులకు రూ.86 కోట్ల రూపాయలు జమ కావలసి ఉందని చెప్పారు. 810 మంది రైతుల బ్యాంకు అకౌంట్లు తప్పుగా ఉన్నందున వాటిని వ్యవసాయ విస్తరణ అధికారులు సరిచేసి డబ్బులు అందే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సునీత పాల్గొన్నారు.