చెన్నూర్ కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం.. 500 పత్తి బేళ్లు దగ్ధం

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని కాటన్మిల్లులో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దాదాపు 500 వరకు పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. కాగా స్థానిక కాటన్ మిల్లులో సీసీఐతో పాటుగా, ప్రైవేట్ వారు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి జిన్నింగ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారి కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ చేసిన తర్వాత పత్తి బేళ్లుగా తయారు చేసి మిల్లు ఆవరణలో ఉంచారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దాదాపు వందల సంఖ్యలో పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణలు తెలియరాలేదు.