ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ: రాహుల్ గాంధీ
హనుమకొండ (CLiC2NEWS): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సులువుగా ఏర్పాటు కాలేదని, ఎంతో మంది యువత, తల్లుల రక్తం, కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రమని, యువతను మోసంచేసిన వారిని గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల రాహుల్ గాంధీ పరామర్శించారు.
రాష్ట్రంలో టిఆర్ ఎస్ పాలన గురించి కొన్ని విషయాలను ప్రజలను అడగాలని అనుకుంటున్నా, ఏ కలలను సాకారం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. వాటిని ఈ ప్రభుత్వం నెరవేర్చిందా అంటూ ప్రశ్నించారు. కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దుస్థితికి ఎవరు కారణం అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధనలో ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. రైతు సోదరులను ఆందోళన చెందవద్దని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ యవతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం, కాంగ్రెస్ విధివిధానాలను విమర్శిస్తే ఉరుకునేది లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తానని రాహుల్ గాంధీ అన్నారు.