సింగరేణి కార్మికులకు తీపి కబురు.. దీపావళికి భారీ బోనస్

మంచిర్యాల‌: సింగరేణి యాజమాన్యం కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా మాదిరే దీపావళి బోనస్‌తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్​ఆర్​) బోనస్​ను చెల్లించేందుకు నిర్ణయించినట్లు శనివారం సింగరేణి ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా రూ.68,500 బోనస్ చెల్లించనున్నట్లు అందులో తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్​ గ్రౌండ్​లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్​లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో చెప్పింది. ఈ పీఆర్​ఎస్​ బోనస్​ నాన్​ ఎగ్జిక్యూటివ్​, పదో వేజ్​ బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని తెలిపింది సింగరేణి సంస్థ. ఈ సంద‌ర్భంగా సింగరేణి యాజమాన్యం తో మాట్లాడి ఒప్పించిన టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితకి, టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావుకి, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి కార్మికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.