కరోనాతో ఎమ్మెల్యే మృతి

డెహ్రాడూన్ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
అలాగే ఎంతో ప్రముఖులు సైతం ప్రాణాలను కోల్పోయారు. తాజాగా.. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా (50) కరోనా వైరస్తో కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడ్డ ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. రెండు వారాల కిందట కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జీనా ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో కన్నుమూశారు. ఇంతకు ముందు సురేంద్రసింగ్ భార్య ధర్మాదేవి సైతం ఇటీవల కరోనా బారినపడ్డారు. అదే సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సురేంద్రసింగ్ ప్రస్తుతం అల్మోరా జిల్లా స్టాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన మూడుసార్లు విజయం సాధించారు.