China: ఇక ముగ్గురు పిల్లలను కనొచ్చు..!
బీజింగ్ (CLiC2NEWS): ప్రస్తుతం 141 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో చైనా కొనసాగుతోంది. గడిచిన 10 సంవత్సరాలలో మన పొరుగు దేశం చైనా జనాభా కేవలం 7.2 కోట్లు మాత్రమే పెరిగింది. పెరుగుదలలో ఇదే అత్యల్పం. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనాలో గరిష్టంగా ముగ్గురు పిల్లలను కనడానికి సోమవారం అధికారికంగా అనుమతి ఇచ్చింది.
తొలుత చైనాలో పెరుగుతున్న జనాభాను అదుపు చేయడానికి 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని కఠినంగా అమలు చేసింది. ఆ తర్వాత 2016 నుంచి ఇద్దరు పిల్లకు జన్మనివ్వడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా ఇవాళ దీనిని ముగ్గురికి పెంచింది. సోమవారం చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం ప్రకటించారు.