అక్రమ నల్లా కనెక్షన్లు కలిగి ఉన్న వ్యక్తిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్(CLiC2NEWS): జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ – 15లోని గచ్చిబౌలి సెక్షన్ పరిధిలో గల శేరిలింగంపల్లి టెలికాం నగర్లో నివసించే రాకేష్ యాదవ్ అనే వ్యక్తి తన భవనానికి అక్రమంగా రెండు 20 ఎంఎం నల్లా కనెక్షన్లు తీసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్లను తొలగించింది. అక్రమ నల్లా కనెక్షన్లు కలిగి ఉన్న రాకేష్ యాదవ్పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని అధికారులు ప్రకటనలో తెలిపారు.