అక్రమ నల్లా కనెక్షన్లు పొందిన నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన నలుగురు వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జలమండలి ఓ ఆండ్ ఎం డివిజన్ – 22 పరిధిలోని తుర్కయంజాల్ సెక్షన్ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు.
తుర్కయంజాల్లోని కమ్మగూడలో గల ఆర్టీసీ కాలనీలో నివసించే జి.భాస్కర్ రెడ్డి, ఆర్.భాస్కరాచారి, సీహెచ్.శౌరిలు, పి.మధు అనే వ్యక్తులు తమ నివాసాలకు అక్రమంగా 15 ఎంఎం పైపు సైజ్ నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు అక్రమ కనెక్షన్లు తీసుకున్న నలుగురిపైన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని జలమండలి అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.