తొల‌గించిన న‌ల్లా క‌నెక్ష‌న్‌ను అక్ర‌మంగా మ‌ళ్లీ తీసుకున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై క్రిమిన‌ల్ కేసు

 

హైద‌రాబాద్‌(CLiC2NEWS): జలమండలి ఓ అండ్ ఎం డివిజ‌న్ – 12లోని చింత‌ల్‌ సెక్ష‌న్ ప‌రిధిలో తొల‌గించిన న‌ల్లా క‌నెక్ష‌న్‌ను అక్ర‌మంగా మ‌ళ్లీ తీసుకున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. కుత్బుల్లాపూర్‌లోని విమాన‌పురి కాల‌నీలో శ్రీసాయిరాం గ్లోబ‌ల్ స్కూల్ న‌డుస్తున్న భ‌వ‌నానికి గ‌తంలో 20 ఎంఎం న‌ల్లా క‌నెక్ష‌న్ ఉండేది. అయితే, 2018లో జ‌ల‌మండ‌లి ఈ క‌నెక్ష‌న్‌ను తొల‌గించింది. అయినా కూడా ఈ భ‌వ‌న యాజ‌మానులు అక్ర‌మంగా మ‌ళ్లీ 20 ఎంఎం న‌ల్లా క‌నెక్ష‌న్‌ను పున‌రుద్ద‌రించుకున్నారు. జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం ఈ విష‌యాన్ని గుర్తించి అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను తొల‌గించింది. జ‌ల‌మండ‌లి మేనేజ‌ర్ ఫిర్యాదు మేర‌కు శ్రీ సాయిరాం గ్లోబ‌ల్ స్కూల్ భ‌వ‌నానికి అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్ తీసుకున్న న‌ల్లపాటి వెంక‌టేశ్వ‌ర్లు, ఎం.క‌రుణాక‌ర్ రెడ్డిపై జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్‌లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్ష‌న్ల‌ కింద‌ కేసు న‌మోదైంది.

అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్ర‌మంగా న‌ల్లా క‌నెక్ష‌న్లు తీసుకునే యాజ‌మానితో పాటు క‌నెక్ష‌న్‌కు స‌హ‌క‌రించిన ప్లంబ‌ర్‌, ఇత‌ర వ్య‌క్తుల‌పై కూడా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.

Leave A Reply

Your email address will not be published.