మణిపూర్లో రెండు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
ఇంఫాల్ (CLiC2NEWS): ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో సోమవారం రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లు సమాచారం. ఏడు నెలలుగా మణిపుర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య కొనసాగుతున్న వైరం గురించి తెలిసిందే. ఇటీవల శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గం యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గముఖం పడతాయని భావించారు. కానీ సోమవారం తెల్లవారుజామున తెంగ్నౌపాల్ జిల్లాలోని లితు గ్రామ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళుతుండగా.. లితు గ్రామ సమీప ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న మరో సంస్థ సభ్యులు వారిపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా అవతి వర్గం సైతం కాల్పులకు యత్నించింది. సమాచారం అందుకున్న వెంటనే అస్సాం రైఫిల్స్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ చేపట్టాయి.