అన్నవరంలో ఉచిత కల్యాణ మండపం..
అన్నవరం (CLiC2NEWS): అన్నవరంలో పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. ఈ వేదికకు దేవస్థానం అధికారులు కూడా అనుమతిచ్చారు. అన్ని రకాల వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే.
శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి. రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి భవిష్యత్ బాగుంటుందన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతో ఎపిలోనే కాకుండా ఇత ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఏటా ఇక్కడ వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించిన వ్యాపారవేత్త మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న ఈ కల్యాణ మంటపం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పేదలు నెల రోజుల మందు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. బుకింగ్ సమయంలో వధూవరుల ఆధార్ కార్డులు, శుభలేఖ బుకింగ్కౌంటర్లో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.