Dalit Bandhu: 15 మందికి చెక్కులు అందజేసిన సిఎం కెసిఆర్‌

హుజూరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్ట్‌ను ఇవాళ సిఎం కెసిఆర్ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని శాలపల్లిలో జ‌రిగిన బహిరంగసభలో సిఎం కెసిఆర్ ప్ర‌సంగించారు. అనంతరం దళితబంధు పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స‌భ‌లో 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతో పాటు దళితబంధు ఎలక్ట్రానిక్‌ కార్డులను కెసిఆర్‌ అందజేశారు.

స‌భ‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ తన ప్రసంగాన్ని జై భీమ్‌.. అంటూ మొదలు పెట్టారు.

హుజూరాబాద్‌లో ఉన్న‌టువంటి ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో ఈ డ‌బ్బులు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచవ్యాప్తంగా అణ‌గారిన, అణిచివేయ‌బ‌డ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భార‌త‌దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయి. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాణ నుంచి చేసే ప‌ని దేశ‌మంతా వ్యాపించాలని ఆకాంక్షించారు. ఇవాళ మేం చేస్త‌మంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు… మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో హుజూరాబాద్ ద‌ళితులే ఆద‌ర్శం కావాలని కోరారు. రాష్ట్రంలో 17 ల‌క్ష‌ల పైచిలుకు ద‌ళిత కుటుంబాలు ఉన్నాయి. రైతుబంధు త‌ర‌హాలోనే ద‌ళిత బంధు వ‌స్త‌ది. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులైన ద‌ళిత సోద‌రుల‌కు కూడా ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని స్ప‌ష్టం సిఎం చేశారు.

దళితబంధు ను విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్న‌ట్లు లెక్క ఉన్న‌ది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవ‌కాశం ఉంది… రూ.500 కోట్లు ఇచ్చాం. మిగ‌తావి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు ఇస్తాం. ఈ డబ్బుతో అంద‌రూ ట్రాక్ట‌ర్లే కొనొద్దు. ఇది విజ‌య‌వంతం కావాలంటే అంద‌రం ఒక‌టే ప‌ని చేయొద్దు. ఈ స్కీంకు బ్యాంకుల‌కు లింకేజీ ఉండ‌దని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.