బిక్కిన చక్రవర్తి దంపతులకు మంత్రి హరీష్ రావు అభినందనలు..

మండపేట (CLiC2NEWS): కుమారుని అవయవ దానాలతో తన మానవతను చాటుకున్న మండపేటకు చెందిన బిక్కిన చక్రవర్తి దంపతులకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఘన సత్కారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు చేతుల మీదుగా దంపతులు ఇరువురిని అభినందించి సత్కరించారు. జీవన్ దాన్ సంస్ధ 11వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వీరిని ఆహ్వానించి సత్కరించింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మనువడు శ్రీకాంత్ రెండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మండపేట మొత్తం సానుభూతితో విషాదంలో మునిగిపోయింది. శరీరంలో బ్రెయిన్ డెడ్ మినహా మిగిలిన అవయవాలన్నీ యధావిధిగా పని చేయడంతో శ్రీకాంత్ చనిపోయినా అవయావాల మార్పిడి ద్వారా తమ కుమారుణ్ణి చూసుకోవచ్చన్న ఆశతో దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకొని బాధితులకు తమ కుమారుడి అవయవాలను దానం చేసి మరొకరికి ప్రాణం పోశారు. ఈ మానవీయ కోణంలో జీవన్ దాన్ సంస్థ వారిని ఆహ్వానించి  సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు లేడన్న బాధ కంటే తన కుమారుని ద్వారా వేరొకరు బ్రతికారన్న ఆత్మ తృప్తి ఆ తల్లి దండ్రుల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తమ కుమారుడు శ్రీకాంత్ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడన్న భావన ఆ తల్లిదండ్రులకు ఊరట నిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.