RLD అధినేత అజిత్ సింగ్ కన్నుమూత

న్యూఢిల్లీ దేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా ఎవ్వరిని వదిలి పెట్టకుండా బలి తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన…గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా అజిత్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతే కాదు యూపీలోని బాగ్ పాట్ లోక్ సభ స్థానం నుంచి ఏకంగా 7 సార్లు ఎంపిగా గెలిచారు. ఇక ఆయన మృతి పట్ల పలుగురు నేతలు సంతాపం తెలిపారు.
చౌదరి అజిత్ సింగ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని అజిత్ సింగ్ సమర్థంగా కొనసాగించారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన అజిత్ సింగ్ జ్ఞాపకాలను రాష్ర్ట ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.