విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఆరుగురు సజీవదహనం..
కుశినగర్ (CLiC2NEWS): విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కుశినగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా మహిళ ప్రణాలు కోల్పోయారు. అర్ధరాత్రి అంతా నిద్రలో ఉండగా విద్యుత్ షార్ట్సర్క్యూట్ జరిగి.. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటిలోపల నిద్రిస్తున్న సంగీత తన పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. బయట నిద్రిస్తున్న ఆమె భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటలు వ్యాపించడంతో లోపలికి వెళ్లలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి లోపల చిక్కుకున్నవారిని బయటికి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విషాదం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 24 లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.