హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరం నుండి ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఎన్సిబి అధికారలు గుర్తించారు. హైదరాబాద్లోని దోమలగూడలో జెఈఆర్ ఇన్ఫినిటి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాదక ద్రవ్యాల సరఫరా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రధాన నిందితుడైన ఆశిష్ జైన్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ. 3.71 కోట్ల నగదు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సైకోట్రోఫిక్ ఔషధాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన నిందితుడి ఇంట్లో ఎన్సిబి అధికారులు సోదాలు నిర్వహించి, నగదు, మాదక ద్రవ్యాలతో పాటు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెయ్యి సార్లకు పైగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.