జస్టిస్ ఎన్వీ రమణ చొరవతోనే ఆ సమస్యకు పరిష్కారం: ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): గత ఎనిమిది సంవత్సరాల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రం చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామక రంగాల్లోనూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న న్యాయాధికారుల సదస్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.. అన్ని జిల్లాల్లోనూ సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో న్యావ్యవస్థ, పరిపాలనా విభాగం కూడా గొప్పగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నటు సిఎం చెప్పారు.
హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్యపెంపుపై కేంద్ర సర్కార్కి, ప్రధాని మోడీ లేఖ రాశానని కెసిఆర్ గుర్తు చేశారు. అయితే ఆ అంశం పెండింగ్లో ఉండేదని.. సిజెఐగా జస్టిస్ ఎన్ వి. రమణ బాధ్యతలు చేపట్టాక ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు.
హైదరాబాద్ పట్ల జస్టిస్ ఎన్ వి రమణకు చాలా ప్రేమ ఉన్నదని చెప్పారు. సుదీర్ఘ కాలం హైదరాబాద్లో పనిచేసినందుకు ఆయనకు అన్ని విషయాలు తెలుసునన్నారు. సిజెఐ రమణ చొరవ తీసుకుని ప్రధాని, కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర హైకోర్టు లో బెంచీల సంఖ్య 24 నుంచి 42కి పెంచేలా చేశారని వివరించారు.
తెలంగాణ ప్రజల తరఫున.. ప్రభుత్వం తరఫున జస్టిస్ ఎన్ వి రమణకు ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి. రమణ ఉండటం గర్వకారణమని చెప్పారు. ఆయన ఆశీస్సులు, మద్దతు ఎల్లవేళలా ఉండాలని కెసిఆర్ ఆకాంక్షించారు.
న్యాయవ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సిఎం వెల్లడించారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని సిఎం వెల్లడించారు.