UNESCO: రామప్పకు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాం : మంత్రి సత్యవతి
వరంగల్ (CLiC2NEWS): భారతదేశం నుంచి యునెస్కోకు వెళ్ళిన 2 ప్రతిపాదనల్లో తెలంగాణ వరంగల్ కు చెందిన రామప్ప ఆలయం ఉండడం మనకు గర్వ కారణము.. రామప్పకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు యునెస్కో కట్టడాల గుర్తింపు సమావేశాలు ప్యారిస్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావాలని మంత్రి సత్యవతి నేడు ఆ ఆలయాన్ని సందర్శించి శ్రీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రామప్ప ఆలయ నిర్మాణంలో ఎంతో గొప్ప కళానైపుణ్యం ఉందన్నారు. శివుడు నెలకొన్న గర్భగుడిలో వెంటిలేషన్ సదుపాయం లేకున్నా లోపల వెలుగు ఉండేలా దీనిని అద్భుతంగా నిర్మించారు. ఇంత విశిష్టమైన రామప్పను ప్రపంచ స్థాయి సంపదగా గుర్తించాలని కోరుకుంటున్నాం అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తోపాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.