Weekend Lockdownపై నిర్ణ‌యం తీసుకోండి

తెలంగాణ స‌ర్కార్ ను ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌సంఖ్య‌ను దృష్టిలో ఉంచుకొని వారాంత‌పు లాక్‌డౌన్ లేదా క‌ర్ఫ్యూ వేళ‌లు పొడిగింపును ప‌రిశీలించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు సూచించింది. ఈ నెల 8 లోగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హారజయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేసింది.

మాస్కు ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించింది. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది.

‘‘వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపు ప్రతిపాదనను పరిశీలించాలి. ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రైవేట్‌ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పరీక్షలు తగ్గించొద్దు.. రోజుకు లక్షకుపైగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

సంచార వ్యానుల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి. ఖైదీలు నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో స్పష్టం చేయాలి. రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలి. శ్మశాన వాటికల్లో సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల ఆంక్షలపై వెంటనే జీవో ఇవ్వాలి. ఆసుప‌త్రుల వ‌ద్ద పోలీసు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధ‌రించని వారి వాహ‌నాల జ‌ప్తు అంశాన్ని ప‌రిశీలించాలి. పోలీసుల‌కు ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పించ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల్సిందే. ఔష‌ధాల అక్ర‌మ విక్ర‌యాల‌పై మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. ఫంక్ష‌న్ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆక‌స్మిక త‌నిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్ ఫ‌లితాలు 24 గంట‌ల్లో వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుంచి రాక‌పోక‌ల‌కు సంబంధించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి’’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మ‌రోవైపు క‌రోనా నిబంధ‌న‌ల అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 859 పెట్రోలింగ్‌, 1,523 ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఏర్పాటు చేసిన‌ట్లు డిజిపి మ‌హేంద‌ర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతిక దూరం పాటించ‌ని సంస్థ‌ల‌పై కేసులు పెడుతున్నామ‌ని .. భౌతిక‌దూరం పాటించ‌ని వ్య‌క్తుల‌పై కాద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఔష‌ధాల అక్ర‌మ విక్ర‌యాల‌కు స‌బంధించి 39 కేసులు న‌మోదు చేసిన‌ట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్‌ హైకోర్టుకు తెలుపగా.. వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది.

Leave A Reply

Your email address will not be published.