అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

న్యూఢిల్లీ: దేశం విజృంభిస్తున్న కరోనా వైరస్పై కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇంటర్నేషనల్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకూ పొడిగించింది. ఈ మేరకు పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, డీజీసీఏ ఆమోదం పొందిన విమాన సేవలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. గత ఏడాది జూన్ 26న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తూ జారీ అయిన ఉత్తర్వుల అమలును మార్చి 31 అర్ధరాత్రి వరకూ పొడిగించామని డీజీసీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.