AP: ఆనందయ్య మందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
కంటిలో వేసే చుక్కల మందుకు తప్ప మిగతా వాటికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతి
అమరావతి (CLiC2NEWS): నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయురే్వద మందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ పచ్చజెండా ఊపింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సిసిఆర్ ఎఎస్)కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది.
ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ రోగులు రావొద్దు అని సర్కార్ స్పష్టం చేసింది. కోవిడ్ రోగుల బంధువులు వచ్చి మందు తీసుకెళ్లాలని సూచించింది. ఇక, మందు పంపిణీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని పేర్కొంది. ప్రస్తుతానికి అయితే.. ఆనందయ్య ఇచ్చే పీ,ఎల్,ఎఫ్ మందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
అంతకు ముందు ఆయుర్వేద మందును సర్కార్ పంపిణీ చేయాలంటూ ఆనందయ్యతో పాటు మరో ఇద్దరు వేసిన పిటిషన్పై హైకోర్టో విచారణ జరిగింది. కాగా ఔషధంపై రాష్ట్ర సర్కార్ నిర్ణయం తెలుపాలని సర్కార్ తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ఈరోజు దీనిపై సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్ట ప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి సర్కార్ అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. ఈ లోపు ఆనందయ్య మందుకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని సర్కార్ అధికారికంగా కోర్టుకు తెలిపే అవకాశముంది.