ఈసారి తప్పకుండా సెంచరీ కొడతాం..!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన ఆయన.. హైదరాబాద్ ప్రగతి నివేదికను విడుదల చేశారు. అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన కేటీఆర్.. ఈ సారి సెంచరీ కొడతామన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో సెంచరీ మిస్సయ్యామని గుర్తు చేసుకున్న కేటీఆర్.
ఒక్క బాల్ కొడితే సెంచరీ అయ్యేది.. కానీ, జాంభాగ్లో 5 ఓట్లతో ఓడిపోయామని. కానీ, ఈసారి తప్పకుండా సెంచరీ కొడతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని, మరోసారి గ్రేటర్పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. ఈ సారి గ్రేటర్ బరిలో 85 మహిళ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామన్నారు కేటీఆర్. 75 సీట్లు బీసీలకు కేటాయించామని. బీసీలలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్న ఆయన. 50 శాతం సీట్లు బీసీలకే ఇచ్చామని. 17 సీట్లు మైనార్టీలకు, 3 సీట్లు ఎస్టీలు, 13 సీట్లు ఎస్సీలకు, ఇతర సీట్లు అగ్రవర్ణాలకు కేటాయించామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పోటీకి అవకాశం ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి కేటీఆర్.
‘ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. హైదరాబాద్కు ఏం చేస్తరో బీజేపీ నేతలు చెప్పాలి. ఎక్కడ ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో చెప్పండి. ఇన్ని అభివృద్ధి పనులు చేసినా ఎలాంటి పన్నులు పెంచలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ 50శాతం తగ్గించాం. లాక్డౌన్లో ఇంటింటికీ రూ.1500 సాయం చేశాం. టీఆర్ఎస్ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను కలిసి మద్దతు కోరాలి. ఎల్ఐసీ, రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించండి. ప్రతీ వర్గం ఆశీస్సులను తీసుకోవాలి. హైదరాబాద్లో అంతా బాగుంది కాబట్టే ప్రముఖ కంపెనీలు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సంస్థలు ఇక్కడికి వచ్చాయని’ మంత్రి పేర్కొన్నారు.