`ఉక్కు మనిషి`కి శిరసెత్తి వందనం..

సామ, దాన, బేధ, దండోపాయాలతో భార‌త‌దేశంలోని మొత్తం 562 సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సమైక్యతా మూర్తికి శిరసెత్తి వందనం.. స్వాతంత్ర్యం అనంతరం భార‌త‌దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పరిష్కరించిన భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు..   క్లిక్‌2న్యూస్‌ ఘ‌నంగా నివాళుల‌ర్పిస్తోంది.

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించారు. సామాన్య గృహస్థుడైనా 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడారు.

వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరి లో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టారు. 1904లో ఆయనకు ఒక కుమార్తె – మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచారు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసారు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నారు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసారు.

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసారు. అదే క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించారు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవారు.

 

పటేల్ ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు.

స్వాతంత్ర్య ఉద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు.

భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించారు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశారు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించారు

OLYMPUS DIGITAL CAMERA

స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనారు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 31 అక్టోబరు 2018 న అత్యంత ఘనం గా ఆవిష్కరించారు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.