ఉద్యోగికి కరోనా దెబ్బ!
ప్రతి పది మందిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్: తాజా సర్వేలో వెల్లడి

హైదరాబాద్ : కరోన దెబ్బకి ప్రపంచం వణికిపోతోంది… ధనిక దేశం.. పెద దేశం అనే తేడా లేకుండా అగ్రరాజ్యం అమెరికాతో పాటు అన్నిదేశాలు దిక్కుతోచని స్థిలోకి వెళ్లాయి. అత్యధిక జనాభా గల భారత్ లాంటి దేశాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటికే చాలా మందికి చేయడానికి పనిలేక పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని పలు పట్టణాలలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు ఇప్పటికే ఊస్ట్ అయ్యాయి. పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా మార్చి నుంచి ప్రైవేటు స్కూలు టీచర్చ మొదలు సాఫ్ట్ వేర్ ఉద్యోగి వరకు అందరికి ఇళ్లలో డబ్బులు నిండుకున్నాయి. దాంతో చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం విళయతాండవం చేస్తోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సిఎంఐఇ) సర్వేలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు 8.35 శాతంగా నమోదైంది. జులైలో 7.43 శాతం ఉంటే.. ఆగస్టు నాటికి 8.35 శాతానికి చేరింది. పట్టణాల్లో వ్యాపారాలు కుదేలవ్వడంతో అందులో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి పది మందిలో ఒకరి ఉద్యోగం పోయినట్లు సర్వే వెల్లడిస్తోంది. వీరిలో 30 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో నిరుద్యోగం రేటు కొంత తగ్గినట్లు సర్వే వెల్లడించింది. జులైలో 9.1 శాతం ఉంటే.. ఆగస్టు నెలాఖరుకు 5.8 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతంగా నమోదైంది. ఆ తరువాత త్రిపురలో 27.9 శాతంగా ఉంది. మొత్తం 13 రాష్ట్రాల్లో 13 శాతం కన్నా ఎక్కువగా ఉంది. సర్వే చేసిన నెలల్లో 15.5 శాతం మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. మరో 21.7 శాతం మందికి చేసేందుకు పని లేకుండాపోయింది. కొందరికి ఏప్రిల్ నెలకు వేతనాలు కూడా అందలేదు. కరోనాకు ముందుతో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం 48 శాతం పడిపోయింది. కరోనా కారణంగానే ఉద్యోగాలు పోయాయని 90 శాతానికి పైగా అభిప్రాయపడ్డారు. చూడాలి ఈ కరోనా ఇంకెంతకాలం ఇలా ఇబ్బందులకు గురిచేస్తుందో.