ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్యకు కరోనా

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన ప‌డ్డారు. అయితే ఆయ‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, ఆరోగ్యంగాఉన్నార‌ని ఉప‌రాష్ట్రప‌తి కార్య‌ల‌యం మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది. మంగళవారం ఉదయం రొటీన్‌గా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మకు కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. వెంకయ్యకు కరోనా సోకినా లక్షణాలేవీ కనిపించలేదని, ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఉపరాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలియగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్‌ చేసి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంక‌య్య నాయుడుకి క‌రోనా అన్న విష‌యం తెలియ‌గానే దేశ‌వ్యాప్తంగా ఆయ‌న శ్రేయోభిలాషులు, పార్టీల నేత‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంక్షిస్తూ సామాజిక మాధ్య‌మాల ద్వారా సందేశాలు పంపారు.

ప్రధాని సలహా మేరకు వెంకయ్యకు సీటీ స్కాన్‌ నిర్వహించగా ఛాతీ, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాయని, కరోనా ప్రభావం అత్యంత స్వల్పంగా మాత్రమే ఉన్నట్టు తేలిందని అధికారులు తెలిపారు. ఇటీవల వెంకయ్య రాజ్యసభ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సిబ్బందిలో 83 మందికి, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందిలో 13 మందికి కరోనా సోకింది. నిత్యం వ్యాయామం చేస్తూ, నడకకు ప్రాధాన్యమిచ్చి ఆరోగ్య సూత్రాలు పాటించే వెంకయ్య క్షేమంగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి.

 

Leave A Reply

Your email address will not be published.