అంబులెన్సులను ఆపేయడం మానవత్వమేనా..: హైకోర్టు
రాష్ట్ర సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. కాగా.. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఏ అధికారంతో అంబులెన్స్లను ఆపారు? విపత్తు వేళ అంబులెన్స్లు నిలిపివేయడం మానవత్వమేనా? రాత్రి కర్ఫ్యూ అమలు సరిగా లేదు. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు? రంజాన్ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా? కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరం’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
“ప్రభుత్వం చెప్పే విషయాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదు. కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశిస్తే మరింత తగ్గిస్తారా? నఇబంధనల ఉల్లంఘనపై మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేయడం బాధాకరం, అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏమిటో చెప్పండి“ అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇదిలావుంటే, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా లాక్ డౌన్ అంశంపై చర్చించనున్నారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.