ఖాజీప‌ల్లి అట‌వీ అభివృద్ధికి ప్ర‌భాస్ భారీ విరాళం!

హైద‌రాబాద్: అగ్ర‌క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ ఖాజీప‌ల్లి అర్బ‌న్ ఫారెస్ట్‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఔట‌ర్ రింగ్‌రోడ్డుకు స‌మీపంలో ఉన్న 1650 ఎక‌రాల అట‌వీ భూమిని ద‌త్త‌త తీసుకున్న ఆయ‌న ఆ ప్రాంత అభివృద్ధికోసం రూ. 2 కోట్లు అందించారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకో టూరిజం కేంద్రం అందుబాటులోకి రానుంది. స్వయంగా ఖాజిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన ప్రభాస్, తన దత్తత విషయాన్ని ప్రకటించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటడంతో పాటు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ పై నుంచి అటవీ అందాలను వీక్షించారు.

సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తితో, పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ప్రభాస్ ప్రకటించారు. అటవీ ప్రాంతం అభివృద్ది కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ప్రభాస్ వెల్లడించారు. ముందస్తుగా రెండు కోట్ల రూపాయల చెక్కును ప్రభుత్వానికి అందించారు. మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, దుండిగల్ మధ్య ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతం అంతా ఔటర్ రింగు రోడ్డు పక్కనే విస్తరించి ఉంది. చుట్టు పక్కల అభివృద్ది చెందిన నివాస కాలనీలు, పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని అర్బన్ పార్కుగా అందుబాటులోకి తేవటంతో పాటు, మిగతా ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్ గా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.

ఖాజిపల్లి రిజర్వు అటవీ ప్రాంతం వివిధ రకాల ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. మూడు కంపార్ట్ మెంట్లలో విస్తరించి ఉన్న 1650 ఎకరాల అటవీ ప్రాంతాన్ని మొత్తం కచ్చితమైన సరిహద్దుల ఏర్పాటుతో అటవీ శాఖ కాపాడనుంది. సమీప ప్రాంత వాసులకు అందమైన పార్కు అందుబాటులోకి వచ్చేలా తక్షణం పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో పార్క్ గేట్, సీ థ్రూ వాల్, వాకింగ్ ట్రాక్, వ్యూ పాయింట్, గజేబో, ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారు. అదేవిధంగా అటవీ స్థలం ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా తగిన రక్షణ చర్యలను కూడా తీసుకోనున్నారు.

దుండిగల్, గడ్డపోతారం, గుండ్ల పోచంపల్లి, గాగిల్లాపూర్, కిష్టాయపల్లి, ఖాజిపల్లితో పాటు ఔటర్ కు ఇరువైపులా వెలిసిన కాలనీలు, టౌన్ షిప్ లకు ఈ అర్బన్ పార్క్ స్వచ్చమైన ఆక్సీజన్ ను అందించే కేంద్రంగా ఉపయోగపడనుంది. HMDA పరిధిలో ఉన్న అన్ని అటవీ బ్లాకులకు అభివృద్ది చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా తీర్చి దిద్దాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ అర్బన్ పార్కుకూడా అభివృద్ది చెందనుంది.

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చొరవ అభినంద‌నీయం

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు అడవుల సంరక్షణకు అధిక ప్రాధ‌న్య‌నిస్తున్నారన్నారు. న‌గర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు తీసుకుంటున్న ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లాంటి ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌ అటవీ ప్రాంతాన్ని సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అర్బ‌న్ ఫారెస్ట్, ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ది చేస్తున్నారని…. దీన్ని స్పూర్తిగా తీసుకుని సినీ న‌టుడు ప్ర‌భాస్ కాజీప‌ల్లి రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్దికి ముందుకు రావ‌డం అభినంద‌నీయమని తెలిపారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని వివిధ రంగాల‌కు చెందిన వ్య‌క్తులు ముందుకు రావాల‌ని కోరారు.

ఏడాది కాలంలోనే మాట నిలుపుకున్న ఎం.పీ సంతోష్ కుమార్

గత యేడాది మంత్రి కేటీయార్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. ఆమేరకు ఆగస్ట్ 31, 2019న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్దికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు. ఈ యేడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్ ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వంతోనూ, అటవీ శాఖతోనూ సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు అయింది. త్వరలోనే మరిన్ని అటవీ బ్లాకులను ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు దత్తత ఇచ్చే అవకాశం ఉందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. కోవిద్ నిబంధనల కారణంగా అతి కొద్ది ఆహ్వానితుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.